ఏపీలో ఎన్నికలకు సిద్ధమైన వైసీపీ.. ఇవాళ్టి నుంచి 5 చోట్ల సిద్ధం పేరుతో బహిరంగ సభలు

YCP: భీమిలిలో ఎన్నికల శంఖారావం పూరించనున్న జగన్

Update: 2024-01-27 07:03 GMT

ఏపీలో ఎన్నికలకు సిద్ధమైన వైసీపీ.. ఇవాళ్టి నుంచి 5 చోట్ల సిద్ధం పేరుతో బహిరంగ సభలు

YCP: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన వైసీపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వై నాట్ 175 అంటూ క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల మార్పుపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ నాలుగో విడతల్లో 50 మంది అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ లు, 10 లోక్ సభ ఇన్‌ఛార్జ్ లను నియమించారు. వీరిలో కొంతమందికి సీటు ఇవ్వడానికి నిరాకరిస్తే మరికొంత మందిని వేరే నియోజకవర్గాలకు మార్పు చేశారు. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. మరో 10 మంది ఎంపీ లు, ఐదారు అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.

రేపల్లె,ప్రత్తిపాడు, చిలకలూరిపేట, విజయవాడ వెస్ట్ స్థానాల్లో ఇటీవల ప్రకటించిన ఇన్‌ఛార్జ్ లస్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. రెండేళ్లుగా చేస్తున్న సర్వేల ఆధారంగా ,ప్రజల్లో సానుకూలత లేని సిట్టింగ్ లకు సీటు నిరాకరించారు వైసీపీ అధినేత. ఇలా సీటు కోల్పోయిన వారు కొత్తగా వచ్చిన ఇన్‌ఛార్జ్‌లకు సహకారం అందించడం‌లో పూర్తిగా సానుకూలత వ్యక్తంచేయడం లేదు.

మరికొంత మందిని స్వయంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలిచి వారికి నచ్చచెప్పడం తో సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. దీంతో ఇవాళ్టి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు జగన్.

ఇవాళ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళుతున్న జగన్ ఇవాళ ఉత్తరాంధ్ర లోని భీమిలిలో మొదటి బహిరంగ సభ లో పాల్గొంటారు. తరువాత క్యాడర్ సమావేశమవుతున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మూడు లక్షల మంది ప్రజలు పాల్గొంటారు. తరువాత వరుసగా సీఎం సభలు నిర్వహించనున్నట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి. కొన్ని జిల్లాలు కలిపి ఒక చోట బహిరంగ సభ పెట్టడం, అదే రోజు సాయంత్రం ఆయా జిల్లాల క్యాడర్ తో సమావేశాలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు

మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 10 వ తేదీ లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ కేడర్ కీలక పాత్ర పోషిస్తుంటారు. అందుకే కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్

అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ?.ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ?వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి ?.కేడర్ పాత్ర ఎలా ఉండాలి ? వంటి అంశాలపై వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇన్ ఛార్జలకు కేడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల,అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కోసం జిల్లాల పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి ఇకపై రాజకీయంగా దూకుడుగా ముందుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

బీమిలిలో సభ అనంతరం వరుసగా మరో నాలుగు సభలు కూడా నిర్వహించనున్నారు ఈ నెల 30న ఏలూరు,వచ్చే నెల 2న అనంతపురం సభలు ఆ తరవాత మరో రెండు సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా అయిదు సభలతో క్యాడర్ లో ఉత్సాహం నింపనున్నారు.

Tags:    

Similar News