Kurnool: కర్నూలు GGHలో విశ్రామ్ సదన్.. రోగుల సహాయకులకు ఊరట
Kurnool: కర్నూలు GGHలో రూ. 14.6 కోట్లతో నిర్మించనున్న 'విశ్రామ్ సదన్' పనులపై సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు సమీక్ష నిర్వహించారు.
Kurnool: కర్నూలు GGHలో విశ్రామ్ సదన్.. రోగుల సహాయకులకు ఊరట
Kurnool: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల సహాయకుల వసతి సౌకర్యార్థం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (CSR) నిధులతో నిర్మించడానికి తలపెట్టిన ‘విశ్రామ్ సదన్’ ప్రాజెక్టుపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు గారు పవర్ గ్రిడ్ మరియు NBCC ప్రతినిధులతో ఈరోజు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నవంబర్ 25న ప్రాథమిక చర్చలు జరిగిన నేపథ్యంలో, నేడు పనుల పురోగతి మరియు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ Dr K.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ విశ్రామ్ సదన్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ మరియు డిజైన్లు సిద్ధమయ్యాయని, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సమీపంలో త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.త్వరలో అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి, శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
రూ. 14.6 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ 150 పడకల భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 18 నెలల కాలపరిమితిలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని NBCC అధికారులను ఆదేశించారు. దీనివల్ల రోగి అటెండెంట్లకు ఆసుపత్రి ప్రాంగణంలో విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు.
ఈ విశ్రామ్ సదన్ను కేవలం రోగుల సహాయకుల కోసం మాత్రమే కేటాయించడం జరుగుతుందని,150 పడకల సామర్థ్యంతో ఉండే ఈ భవనం రోగుల సహాయకులకు అనుకూలంగా ఉండే లాగున మరియు అత్యంత పరిశుభ్రంగా నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
భవనం పూర్తయిన తర్వాత వసతి పొందే అటెండెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేలా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తామని, భద్రత మరియు పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే పేద రోగుల సహాయకులకు ఆసుపత్రి ఆవరణలో సురక్షితమైన నీడ కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు.