Kanna Lakshminarayana: త్వరలో టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ..?
Kanna Lakshminarayana: సోము వీర్రాజు తీరుపై కన్నా పరోక్ష విమర్శలు
Kanna Lakshminarayana: త్వరలో టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ..?
Kanna Lakshminarayana: ఏపీ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఒకవైపు ఏపీలో బీజేపీ బలోపేతం కావాలని అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే.. నేతల మధ్య వార్ ముదిరి పాకాన పడి రాజీనామాలు చేసే వరకూ వెళ్లింది. సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. కన్నా రాజీనామాతో పార్టీలో ఏం జరగబోతుంది? పార్టీని వీడినా మోడీపై అభిమానం ఏమాత్రం తగ్గదని చెబుతున్న కన్నా వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి?
కొద్ది రోజులుగా బీజేపీలో మొదలైన లుకలుకలు కన్నా రాజీనామాకు కారణమయ్యాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుపై కన్నా వర్గం గుర్రుగా ఉంది. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే అయినా ఒకరంటే ఒకరికి అస్సలు పడటంలేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్నా ఏ మాత్రం బయట పడకుండా చాపకింద నీరులా ఇద్దరి మధ్య యుద్ధం నడిచింది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం కన్నా లక్ష్మీనారాయణ గైర్హాజరవుతూ వచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయవాడ వచ్చినా ఆయనను కలవలేదు. ఎట్టకేలకు కన్నా లక్ష్మీనారాయణ తన రాజీనామాను ప్రకటించేశారు.
కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన ఆరోపణ తన వర్గాన్ని సోము వీర్రాజు టార్గెట్ చేశారని. అంతేకాదు కన్నా రాజీనామా విషయంలో చాలా ఆలస్యం జరిగిందట. గతంలో రాజీనామా చేద్దామనుకుని రాజీ పడ్డా అని చెప్పుకొచ్చారు. అంతేకాదు సోము వీర్రాజు నిర్ణయాలు పార్టీకి ఏమాత్రం పనికొచ్చేవిలా లేవని అంటున్నారు కన్నా వైసీపీకి కోవర్టులా సోము వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ కమలానికి గుడ్ బై చెప్పేశారు. మరి ఇప్పుడు సైకిల్ ఎక్కుతారా? వారాహి ఎక్కుతారా అనేది క్లారిటీ లేదు. భవిష్యత్ కార్యచరణ త్వరలో ప్రకటిస్తా అని చెప్పినా ఇప్పటికే చంద్రబాబుతో అన్నీ మాట్లాడుకునే ఈ నిర్ణయం తీసుకున్నారనేది గుంటూరు పొలిటికల్ సర్కిల్లో వివినిపిస్తున్న టాక్.