ఏపీలో ఇసుక కొరత ఇద్దరు తాపీ మేస్త్రీల ప్రాణాలు తీసింది. సర్కారు కొత్తపాలసీ కారణంగా గడచిన ఐదు నెలల నుంచి భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో వారు సతమతమవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా తాజాగా గుంటూరు జిల్లాలో మరో ఇద్దరు బలవంతంగా ప్రాణం తీసుకున్నారు.
గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామానికి చెందిన ఆడపా రవి పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. దీంతో ఇవాళ పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రవి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అలాగే, తాడేపల్లి మండలం ఉండవల్లిలో నాగరాజు అనే తాపీ మేస్త్రీ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఇతను కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం కానరాక దారుణానికి ఒడిగట్టాడు. పనులు లేని కారణంగా దీపావళి నుంచి ఇంట్లో గొడవలు అవుతున్నాయని, వేరే పని చూసుకోమని చెబుతున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భవిష్యత్తు అర్థంకాక బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు.