తిరుపతిలో ‘నో హెల్మెట్- నో పెట్రోల్’ ర్యాలీ
హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు.
తిరుపతి: హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కోరారు. తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడితో కలసి జిల్లా కలెక్టర్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా ‘నో హెల్మెట్ - నో పెట్రోల్ ర్యాలీ’ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయరని తెలిపారు. రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వాహనాలు నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, వారు బాధ్యత విస్మరించినట్లైతే, వారి ప్రాణాలను కాపాడటంలో భాగంగా ప్రభుత్వం నిర్భంద చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. తిరుపతి పట్టణం అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, ఇటువంటి పట్టణాలలో చేపట్టే కార్యక్రమాలు, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రూపొందించుటకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ బాధ్యత అని అన్నారు. ఈ ర్యాలీలో ఏఎస్ పి లు రవి మనోహరాచారి, డి శ్రీనివాసరావు, నాగభూషణం, డీఎస్పీలు, సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.