నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిపై విచారణ..
*ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పిల్కు వెళ్లిన ప్రభుత్వం
Supreme Court: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగింపజేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారించనుంది. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేసింది. అదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పిటీషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ విచారణకు స్వీకరించింది. ఈ రెండు వాదనలపై ఇప్పటివరకు 35 పిటీషన్లు దాఖలయ్యాయి. రైతులు, ఇతర సంఘాల తరఫున దాఖలైన పిటీషన్లన్నింటినీ ఒకటిగా చేర్చి విచారణ చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు నిర్ణయించగా.. ఇప్పుడు దాన్ని పునఃసమీక్షించినట్లు తెలుస్తోంది. మళ్లీ విడివిడిగానే విచారణ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం- రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అత్యున్నత స్థాయి కమిటీ రూపొందించిన నివేదికల్లోని అంశాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేస్తోంది. వాటినేవీ హైకోర్టు పట్టించుకోలేదని జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. వేర్వేరు సందర్భాల్లో లోక్సభ, రాజ్యసభల్లో చేసిన ప్రకటనలను కూడా దీనికి జోడించింది. రాజధాని నగరాలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ నిత్యానందరాయ్ ఇచ్చిన స్టేట్మెంట్లను సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది.