కడప:
దేశవ్యాప్త సమ్మె, రాష్ట్ర బంద్లో భాగంగా తెల్లవారుజామున కడప ఆర్టీసీ బస్టాండ్లో ఆందోళన చేపట్టిన వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ.. కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలు పార్లమెంట్లో బీజేపీకి మద్దతిస్తూ... రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలు:
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఒంగోలు డిపోని ముట్టడించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఒంగోలు బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్న వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు:
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో విద్యాలయాలకు, వ్యాపార సంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. బస్టాండ్ వద్ద వామపక్ష పార్టీ నేతలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్ట్ ఆఫీస్ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామంటున్నారు వామపక్ష నేతలు. కర్నూలు జిల్లాలో బంద్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు.
విజయవాడ:
విజయవాడలో బంద్ కొనసాగుతోంది. బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై వామపక్ష పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బంద్ చేపట్టినట్లు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖపట్నం :
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో వామపక్ష నేతలతో పాటు కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ఉదయం 6 గంటల నుంచి కార్మికులంతా సమ్మెలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం... కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో నిరసనలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బంగారు చిట్టి అందిస్తారు.
మంచిర్యాల:
మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికులు రోడ్డెక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెకు దిగారు. నిరసన చేపట్టిన కార్మికనాయకులను గనుల్లోకి వచ్చేందుకు ప్రత్నించడంతో పోలీసులువారి అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, కార్మిక నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై కార్మిక నాయకులు మండిపడుతున్నారు.