టెక్కలిలో లవ్ డ్రామా: ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు!
Tekkali: ప్రేమించిన యువతి అలిగిందని ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన టెక్కలి రైల్వే స్టేషన్లో కలకలం రేపింది.
టెక్కలిలో లవ్ డ్రామా: ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు!
Tekkali: ప్రేమించిన యువతి అలిగిందని ఓ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన టెక్కలి రైల్వే స్టేషన్లో కలకలం రేపింది. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అబద్ధం చెప్పి పిలిపించాడు:
పోలీసుల వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలానికి చెందిన ఓ యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే, ప్రియురాలిని చూడాలనే కోరికతో సదరు యువకుడు తనకు ప్రమాదం జరిగిందని, వెంటనే టెక్కలి రావాలని ఆమెకు అబద్ధం చెప్పాడు. ఆందోళన చెందిన యువతి ఇంట్లో చెప్పకుండా ఆదివారం టెక్కలి చేరుకుంది.
అలకబూనిన ప్రియురాలు.. పట్టాలపై ప్రియుడు:
టెక్కలి వచ్చాక ప్రియుడు క్షేమంగానే ఉన్నాడని, తనను చూడటం కోసమే అబద్ధం చెప్పాడని తెలుసుకున్న యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో ఆందోళన చెందిన యువకుడు.. "నువ్వు వెళ్లిపోతే నేను నిజంగానే చనిపోతాను" అంటూ ప్లాట్ఫాం పక్కనే ఉన్న రైలు పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు.
అదే సమయంలో గుణుపురం వెళ్తున్న ప్యాసింజర్ రైలు స్టేషన్లోకి వస్తోంది. పట్టాలపై యువకుడిని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై డ్రైవర్కు సంకేతాలు ఇవ్వడంతో రైలు కొద్ది దూరంలోనే ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
పోలీసుల కౌన్సెలింగ్:
సమాచారం అందుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రేమికులిద్దరినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి, సీఐ విజయ్కుమార్ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించి వారిని ఇంటికి పంపించివేశారు.