రేప్ ఎలా చేస్తారో చూపించండి.. ఏపీలో టీచర్ల పైశాచికత్వం!

Update: 2019-08-03 05:23 GMT

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చారు వారు. పిల్లలకు మంచి నేర్పించాల్సిన టీచర్లు తమ వికృత ఆనందం కోసం పిశాచుల్లా మారారు. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించడమే కాకుండా తమ తప్పును కప్పిపెట్టుకునేందుకు సొమ్మును ఎరగా ఇచ్చే ప్రయత్నం చేసి గురువు అనే పదానికి చీడ పట్టించారు. దేహశుద్ది చేసినా బుద్ధి రాని వారు విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు లంచం ఇవ్వచూపిన వ్యవహారం వారిలో వికృతత్వానికి అడ్డం పడుతోంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

చింతలపూడి ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాజశేఖర్, ఉమామహేశ్వరావు అనే టీచర్లకు వికృతమైన ఆలోచన వచ్చింది. తరగతి గదిలోకి వెళ్లి, అక్కడున్న విద్యార్థులను అత్యాచారం ఎలా చేస్తారో తమ ముందు ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఓ బాలికకు గాయాలయ్యాయి.

ఈ విషయం బయటికి పొక్కడంతో గ్రామస్తులు ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని గ్రహించిన ఆ టీచర్లు గ్రామస్తులకు చెరో రూ.80 వేలు ఇచ్చి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన డీఈఓ వద్దకు చేరడంతో శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News