ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన..జగన్ నియంతలా పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. జగన్ ఎవరి మాటలు వినరు. ఆయన వింటే ప్రధాని నరేంద్ర మోదీ మాట మాత్రమే వింటారు. ఎందుకంటే ఆయన ఏమైనా జగన్ను చేస్తాడేమో అనే భయంతో వింటారు. సీఎం జగన్ హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయట్లేదు అని అన్నారు.
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయం సరికాదు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కొనసాగించాలని చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో చదువుకున్న ప్రతిఒక్కరికీ తెలుసు అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నాటికి నేటికీ చాలా మార్చులు వచ్చాయని, బస్సులు జాతీయం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి న్యాయ స్థానం కేవలం సలహా ఇస్తేనే రాజీనామా చేశారని ఆయన అన్నారు. అటువంటి రాజకీయాలను చూసినవాడిని ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం బాధగా ఉందని ఆయన అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాజ్యాంగబద్దంగా పాలన సాగించాలని, నేనే రాజు నేను తప్ప ఎవ్వడూ లేడనే పద్ధతి సాగుతోందని ఆయన అన్నారు.