సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala: తిరువీధుల్లో భక్తజన కోలాహలం - ఆకట్టుకున్న మహిళ నృత్యరీతులు
సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala: భజనలు.. కోలాటాలు.. వేదమంత్రాలు.. మంగళవాయిద్యాల నడుమ తిరుమల గిరుల్లో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన బ్రహ్మోత్సవాలు భక్తుల్ని పులకింపజేశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ ఆంతర్యం.
బ్రహ్మోత్సవాల్లో తిరుమల మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంలో సాక్షాత్కరించారు. స్వామివారు వేణుగోపాల కృష్ణుడిరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కన్నులపండువగా సాగింది.