Arava Sridhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్: సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితురాలు.. పవన్ కల్యాణ్ పేరు తీయొద్దంటూ వినతి!
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా ఉద్యోగి తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత అంశాన్ని కొందరు రాజకీయ నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
నిజాలు తెలియాలంటే ఫోన్లు చెక్ చేయండి:
"రాజకీయం చేసి పవన్ కల్యాణ్ గారి పేరు చెడగొట్టొద్దు. విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటకు వస్తాయి. నా సెల్ఫోన్తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్ఫోన్ను కూడా పోలీసులు పరిశీలిస్తే వాస్తవాలు ఏంటో స్పష్టంగా తెలుస్తాయి" అని ఆమె పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంగా తమ మధ్య ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసని, అందుకే ఎమ్మెల్యే ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను పరారీలో లేను.. ప్రచారం ఆపండి:
తాను పరారీలో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తన ఫోన్ ఆన్లోనే ఉందని, యూపీఐ లావాదేవీలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "దమ్ముంటే ఆధారాలు బయట పెట్టండి.. అంతే తప్ప లేనిపోని ఆరోపణలు చేయొద్దు" అంటూ ఆమె సవాల్ విసిరారు.
బ్రోకర్ రాజకీయాలు వద్దు:
ఈ వ్యవహారంలో తాతంశెట్టి నాగేంద్రపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జనసేన పార్టీకి నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నీతిగా జీవించే వ్యక్తి అని, ఇలాంటి బ్రోకర్ రాజకీయాల వల్ల ఆయనకు ఇబ్బందులు కలగడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.