జగన్ టార్గెట్‌గా జనసేనాని ఆగ్రహావేశాలు

Update: 2019-12-02 05:44 GMT
పవన్ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. సీఎం సొంత ఇలాఖా అయిన కడప జిల్లాలో జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్‌ కొంతమందికే సీఎంలా వ్యవహరిస్తున్నారని అందుకే ఆయన్ని పేరు పెట్టి పిలుస్తానని స్పష్టం చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ సీమ కాదన్న పవన్ చదువుల తల్లి అని కొనియాడారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై త్వరలోనే ప్రధాని మోడీకి లేఖ రాస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.

రాయలసీమ పర్యటనలో జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి జగన్ టార్గెట్‌ చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో రైతులతో సమావేశమైన పవన్ కల్యాణ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోదిస్తానని కొంతమందికే సీఎంలా ప్రవర్తిస్తే పేరు పెట్టే పిలుస్తానని చెప్పుకొచ్చారు. జగన్ కు బత్తాయి చెట్లు నరికే ధైర్యం ఉంది గానీ ప్రత్యేకహోదా గురించి మోడీని అడిగే ధైర్యం లేదన్నారు. ఇక్కడి రైతుల ఆవేదనను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానన్న పవన్ సీమ బాగు కోసం అందరం కలిసి కష్టపడాలన్నారు. రాయలసీమ అంటే నాయకులకే పరిమితం అయ్యిందని కానీ ఈ నేల చదువుల తల్లి అని కొనియాడారు.

జనసేన నాయకులపై దాడులు జరుగుతున్నాయని అయినా భరిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. తాను సినిమాల్లో చూపించిన పవన్ కల్యాణ్ కాదని చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తిని కాదన్నారు. ఇలాంటి నాయకులను బలంగా ఎదుర్కొంటామన్న పవన్ గొప్ప ఆశయంతో వచ్చానని పోరాటం చేస్తానని చెప్పారు. తాను ఓ కులానికి కానీ, మతానికి కానీ వంతపాడనని చెప్పారు పవన్ కల్యాణ్. ఓడిపోయేందుకు సిద్ధం కానీ ప్రజలను మోసం చేయనని తేల్చిచెప్పారు. చెట్లు నరికే వారికి, ఆడబిడ్డలను చంపే వాళ్లను వెనకేసుకొస్తున్న వారికి పతనం మొదలైందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Full View  

Tags:    

Similar News