ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై ఆర్ఢినెన్స్ రానుందా?

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2020-02-13 13:26 GMT

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని గవర్నర్‌ గురువారం ప్రొరోగ్‌ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీంతో ఆర్డినెన్స్ వస్తుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా సీఆర్డీఏ రద్దుపైనా సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది ప్రభుత్వం. అయితే, ఆ రెండు బిల్లులూ శాసన మండలిలో ఆమోదం పొందలేదు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీలకు పంపిస్తూ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి ఛైర్మన్‌ వ్యవహరించిన తీరును ప్రతిపక్ష టీడీపీ సమర్థిస్తుండగా, అధికార వైసీపీ వ్యతిరేకిస్తోంది.

ఆ రెండు బిల్లులకు సంబంధించి సెలక్ట్‌ కమిటీ సభ్యులను మండలి ఛైర్మన్‌ ఇప్పటికే ఖరారు చేశారు. ఈ నేపధ్యంలో నిబంధనల ప్రకారం సెలక్ట్‌ కమిటీల ఏర్పాటు కుదరదంటూ దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై ఛైర్మన్‌ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే సెలక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆయన ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఉభయ సభలను గవర్నర్‌ ప్రొరోగ్‌ చేయడంతో ఆ బిల్లుల స్థానంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ తేనుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News