ISRO: ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి.. శ్రీహరికోట నుంచి LVM3-M3 రాకెట్ ప్రయోగం..
ISRO: శ్రీహరికోట నుంచి ఇస్రో రెండో వాణిజ్య రాకెట్ ప్రయోగం
ISRO: తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి GSLV మార్క్3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకోసం ఇస్రో అధికారులు ఉదయం 8.30 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్డౌన్ అనంతరం ఉదయం 9 గంటలకు ప్రయోగం షురూ అయింది. కౌంట్డౌన్ ప్రక్రియలో భాగంగా నిన్న ఉదయం నుంచే రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఇవాళ ఉదయానికి రాకెట్లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగాన్ని నిర్వహించారు.
ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్కు చెందిన భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా వన్వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5వేల 805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేశారు. నాలుగు ఉపగ్రహాల చొప్పున..9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కలిసి వన్వెబ్ పేరుతో రెండో ప్రయోగం విజయవంతం చేశారు.