Sullurpeta: ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. సమాచార రంగంలో అత్యాధునిక సేవల కోసం నిర్ధేశించిన జిఎస్సెల్వి ఎఫ్-10 వాహకనౌకను ఖగోళంలోకి పంపే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

Update: 2020-03-04 06:25 GMT

శ్రీ హరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. సమాచార రంగంలో అత్యాధునిక సేవల కోసం నిర్ధేశించిన జిఎస్సెల్వి ఎఫ్-10 వాహకనౌకను ఖగోళంలోకి పంపే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో జీశాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి జియో సింక్రోనస్‌ లాంచింగ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్‌–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.

షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్‌–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ను మొట్టమొదటి సారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు ఇస్రో శాస్త్ర వేత్తలు. ప్రకృతి విపత్తులు.. దేశరక్షణ లాంటి అతిముఖ్యమైన రంగాలకు ఆయువు పట్టులాంటి సమాచారాన్ని అందించే.. ఈ ప్రయోగం పై శాస్త్రవేత్తలు ఎంఆర్‌ఆర్‌ (మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్‌ రిహార్సల్స్‌ పూర్తి చేశారు. ఇవాళ బ్రహ్మప్రకాష్‌ హాలులో ఎంఆర్‌ఆర్‌ చైర్మన్‌ బీఎన్‌ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం మూడు దశల రాకెట్‌ అనుసంధానం పూర్తి చేస్తారు. తర్వాత తుదివిడత పరీక్షలు నిర్వహించి. లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌)కు అప్పగిస్తారు. ఆపై సాయంత్రం ల్యాబ్‌ ఛైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరోమారు రిహార్సల్స్‌ పూర్తిచేసి సా.3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తారు. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభమౌతుంది. అనంతరం గురువారం సాయంత్రం 5.43 గంటలకు జిఎస్సెల్వి ఎఫ్-10 నింగిలోకి దూసుకెళ్లి భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది.


Tags:    

Similar News