శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నుంచి తమ పార్టీ నేతలకు ప్రాణహాని: కన్నా లక్ష్మీనారాయణ

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నుంచి తమ పార్టీ నాయకులకు ప్రాణహాని ఉందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

Update: 2020-03-16 12:56 GMT
Khanna Lakshminarayana in press meet

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నుంచి తమ పార్టీ నాయకులకు ప్రాణహాని ఉందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ స్వగృహంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే దోపిడీలు, దౌర్జన్యాలు, అక్రమాలు, ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులు వంటి అరాచకాలు పెచ్చుమీరిపోయాయని ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయిస్తూ తప్పుడు కేసులను బనాయిస్తున్నారన్నారు.

స్థానిక ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేల చేత దౌర్జన్యకాండకు తెర తీశారని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, కిడ్నాపులు, తప్పుడు కేసులు పెట్టడంతోపాటు పోలీసులచేత బెదిరింపులు చేయించారని చెప్పారు. ఇలా అడ్డదారుల్లో అధికారులు, పోలీసుల అండతో ప్రతిపక్ష పార్టీల నామినేషన్లను తిరస్కరించి, ఉపసంహరించి ఏకగ్రీవాలు చేసుకున్నారన్నారు. ఇక్కడ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి రీ ఎలక్షన్ నిర్వహించాలన్నారు.

కేంద్రం పర్యవేక్షణలో కేంద్ర బలగాల బందోబస్తులో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్ పై ముఖ్యమంతి జగన్ వ్యాఖ్యాలను అక్షేపించారు. రాష్ర్టంలో పరిస్థితులు చూస్తుంటే ఈసీపై కూడా దాడులు చేయరనే నమ్మకం లేదన్నారు. అంతకు ముందు ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన బీజేపీ పట్టణాధ్యక్షుడు కాసరం రమేష్, జనసేన నాయకులు మహేష్ లను పరామర్శించారు. బీజేపీ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ర్ట కార్యదర్శి కోలా ఆనంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.


Tags:    

Similar News