Major Malla Rama Gopal Naidu: తెలుగు వీరుడికి ఏపీ సర్కార్ సలాం: మేజర్ రామ్గోపాల్ నాయుడికి రూ.1.25 కోట్ల రివార్డు!
Major Malla Rama Gopal Naidu: దేశ రక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, మేజర్ మల్లా రామ్గోపాల్ నాయుడిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా గౌరవించింది.
Major Malla Rama Gopal Naidu: దేశ రక్షణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, మేజర్ మల్లా రామ్గోపాల్ నాయుడిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా గౌరవించింది. కీర్తి చక్ర పురస్కార గ్రహీత అయిన ఆయనకు రూ.1.25 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా వాసికి అరుదైన గౌరవం
మేజర్ రామ్గోపాల్ నాయుడు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందినవారు. సాయుధ బలగాల్లో 'చక్ర' అవార్డులు పొందిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందించాలన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఈ భారీ రివార్డును ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్గా ఆయన గుర్తింపు పొందారు.
కుప్వారా ఆపరేషన్లో వీరోచిత పోరాటం
2023 అక్టోబర్ 26న జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో రామ్గోపాల్ నాయుడు అజేయమైన సాహసాన్ని ప్రదర్శించారు. ఇళ్లలో దాక్కున్న ఉగ్రవాదులపై అత్యంత సమీపం నుంచి ఎదురుదాడి చేసి ముగ్గురిని మట్టుబెట్టారు. ఉగ్రవాది విసిరిన గ్రెనేడ్ నుంచి తృటిలో తప్పించుకుని, అతడిని కూడా హతమార్చారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను ఏరివేసి, తన సహచర సైనికుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన చూపిన ఈ అసమాన వీరత్వానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు 'కీర్తి చక్ర' పురస్కారాన్ని ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నగదు బహుమతితో ఆయన కుటుంబ సభ్యులు మరియు శ్రీకాకుళం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.