Chilakaluripet: రేపు చిలకలూరిపేటలో కూటమి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ
Chilakaluripet: సభ నిర్వహణకోసం 13 కమిటీలను ఏర్పాటు చేసిన టీడీపీ
Chilakaluripet: రేపు ప్రధాని మోడీ చిలకలూరిపేటకు రానున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి దగ్గర ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న ఈ తొలి సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ సభలో ఉమ్మడి కార్యచరణ, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
చిలకలూరిపేటలో నిర్వహించే ఈ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాతక్మంగా తీసుకుంది. ఈ సభ నిర్వహణకోసం ప్రత్యేకంగా 13 కమిటీలను నియమించింది. ప్రతి కమిటీలోనూ టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలకు హెడ్గా లారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. 3 పార్టీలు కలిసి సభను నిర్వహిస్తుండటంతో మూడు పార్టీల నేతలు భారీగా హాజరుకానున్నారు. దాదాపు 14 లక్షల నుంచి 16 లక్షల మంది హాజరువుతారని అంచనా వేస్తోంది అధిష్టానం. ఇందుకోసం 100 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు. దూరం ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, కార్యకర్తలకు.. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
పదేళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానుండడంతో మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. వాస్తవానికి 16వ తేదీన ఆయన విశాఖ వస్తారని.. బీజేపీ ర్యాలీలో పాల్గొంటారని ప్రకటన వెలువడింది. అయితే ఈ పర్యటన రద్దయిందంటూ నేతలకు సమాచారం అందింది. దీంతో రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడకు వచ్చి.. అక్కడినుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బొప్పూడి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ సభలో పాల్గొని.. తిరిగి.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.