Vizag Steel Plant నేడు విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర

Vizag Steel Plant ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపట్టారు

Update: 2021-02-20 02:59 GMT
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (ఫైల్ ఫోటో)

Vizag Steel Plant Issue: ఈరోజు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో దానికి వ్యతిరేకిస్తూ కార్మికులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేసేందుకు సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ విడుదల చేశారు.

ఈ రోజు ఉదయం 8గంటల 30నిమిషాలకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అసీల్‌మెట్ట, సంగం జంక్షన్, కాళీ ఆలయం, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, నావల్ అర్మామెంట్ డిపో జంక్షన్, విమానాశ్రయం, షీలా నగర్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ , పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఆర్చి వరకు యాత్రసాగనుంది. ఈ పాదయాత్రలో ఎంపీ విజయసాయిరెడ్డితో పాటుగా ఈ పాదయాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనే అవకాశం ఉన్నది.

ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయసాయి రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభలో ఆ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, విశాఖ జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొననున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని, అవసరమైతే ఢిల్లీకి కార్మిక సంఘాల ప్రతినిధులను తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి గతంలో వివరించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరామని తెలిపారు.

Tags: