Karimnagar: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి పెట్టండి...జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Karimnagar: వెంటనే పరిష్కరించగలిగే సమస్యల విషయంలో ఆలస్యం వద్దని.. సమయం తీసుకునే సమస్యలపై ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సూచించారు
Karimnagar
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతి పత్రాలను స్వీకరించారు. బాధితులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. వెంటనే పరిష్కారం అయ్యే దరఖాస్తులపై సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమయం తీసుకునే దరఖాస్తులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. దరఖాస్తులను ఓపిగ్గా పరిశీలిస్తూ సమస్యలు వింటూ బాధితుల్లో జిల్లా కలెక్టర్ భరోసా నింపారు.
వృద్ధులు దివ్యాంగుల వద్దకే కలెక్టర్ స్వయంగా వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సమస్యలను విని వారికి భరోసా కల్పించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
సరికొత్తగా ప్రజావాణి కార్యక్రమం..
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 290 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల బాధ్యతలు తీసుకున్న జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహిస్తున్నారు. ప్రజావాణి దరఖాస్తులపై అధికారులకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణి...
మున్సిపల్ శాఖకు సంబంధించిన సమస్యలను మున్సిపల్ కార్యాలయంలోప్రజావాణి నిర్వహించారు. కార్పొరేషన్ కు సంబంధించిన సమస్యలపై బాధితులు మున్సిపల్ అధికారి, మేయర్ కు దరఖాస్తులు అందించారు. వాటిని పరిశీలించిన మేయర్ మున్సిపల్ కమిషనర్ పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే కరీంనగర్ ఆర్డిఓ కే మహేశ్వర్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.