Election Survey 2026: బెంగాల్ తమిళనాడుపైనే అందరిదృష్టి... సర్వేలో తెలిన అంశాలు ఇవే
Election Survey 2026: దేశరాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఈ ఏడాది ఏప్రిల్ - మే నెలల్లో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
Election Survey 2026: బెంగాల్ తమిళనాడుపైనే అందరిదృష్టి... సర్వేలో తెలిన అంశాలు ఇవే
బెంగాల్లో టఫ్ ఫైట్: 292 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య పోటీ హోరాహోరీగా మారింది. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, టీఎంసీకి 43% ఓట్లు లభించే అవకాశం ఉండగా, 140 నుంచి 160 సీట్లు గెలుచుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ 41% ఓట్లతో 130 నుంచి 150 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర పార్టీలు 16% ఓట్లతో 8 నుంచి 16 సీట్లు సాధించే అవకాశం ఉంది. మెజారిటీకి 148 సీట్లు అవసరం కాగా, టీఎంసీకి స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ ఫలితం చివరి నిమిషం వరకు ఉత్కంఠగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. బెంగాల్లో జరుగుతున్న సమీకరణాలు, ఉద్రిక్తతలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
అస్సాంలో బీజేపీ ఆధిపత్యం:
126 సీట్లున్న అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మ్యాట్రిజ్ అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 46% ఓట్లు రావచ్చు. 92 నుంచి 102 సీట్లు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమి 36% ఓట్లతో 22 నుంచి 32 సీట్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. చాణక్య సర్వే కూడా ఇంచుమించు ఇదే నివేదికను ఇచ్చింది. దీంతో అస్సాంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తమిళనాడులో ఆసక్తికర పోటీ:
బెంగాల్ తరువాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఈసారి ఇక్కడ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, డీఎంకే 102 నుంచి 115 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ–ఏఐడీఎంకే కూటమి 107 నుంచి 120 సీట్లు సాధించి ముందంజలో నిలవవచ్చని అంచనా. ఇది రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పుకు దారితీయొచ్చు. మరోవైపు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 5 నుంచి 12 సీట్లు గెలుచుకునే అవకాశముందని సర్వే చెబుతోంది. ఈ పార్టీ ప్రభావం ప్రధాన పార్టీల ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, విజయ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకున్నా.. తనదైన ప్రభావం చూపుతాడని, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించే విధానాలపై మూడో పార్టీకి అధికారం లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
కేరళలో త్రిముఖ పోటీ:
కేరళలో పోటీ త్రిముఖంగా మారింది. అధికార వామపక్ష కూటమి 62 నుంచి 68 సీట్లు గెలుచుకోగలదని అంచనా. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 67 నుంచి 73 సీట్లు సాధించి స్వల్ప ఆధిక్యం పొందవచ్చని సర్వే చెబుతోంది. అయితే, ఇక్కడ అనూహ్యంగా బీజేపీ బీజేపీ 15% ఓట్లతో 5 నుంచి 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులు 3 సీట్ల వరకు పరిమితమయ్యే అవకాశం ఉంది. కేరళ గడ్డపై ఎలాగైనా అడుగుపెట్టాలని చూస్తున్న బీజేపీకి ఇది సువర్ణావకాశం. చాలా కాలంగా ఎంత ప్రయత్నించినా ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడంతో బీజేపీ కేరళలో ప్రయత్నిస్తే మార్పు వస్తుందని గుర్తించింది. క్షేత్రస్థాయి నుంచి పనిచేసుకుంటూ వస్తుండటం, కేరళ పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపడంలో విజయం సాధించింది. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో మనుగడను సాధించడంతో పాటు 8 వరకు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మొత్తంగా చూసుకుంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిగా వేర్వేరు రాజకీయ సమీకరణాలతో సాగుతున్నాయి. బెంగాల్లో గట్టి పోటీ, అస్సాంలో బీజేపీ ఆధిపత్యం, తమిళనాడులో అనూహ్య మార్పుల సూచనలు, కేరళలో త్రిముఖ పోటీ ఇవన్నీ కలిపి ఈ ఎన్నికలను అత్యంత కీలకంగా మార్చాయి. సర్వేలు ఒక దిశ చూపించినా, అసలు ఫలితం మాత్రం ఓటర్ల తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.