Markapuram: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ క్యాంపెయిన్ను పరిశీలించిన కలెక్టర్
Markapuram: మార్కాపురం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త నమోదుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపెయిన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించారు.
Markapuram: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ క్యాంపెయిన్ను పరిశీలించిన కలెక్టర్
మార్కాపురం: మార్కాపురం జిల్లా లో ఓటర్ జాబితాలో తప్పులు, మార్పులు, సవరణలు చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ డేలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. శనివారం తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలతో పాటు మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆజాద్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ SIR కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు, అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని చెప్పారు.
ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్పు, పేరు, చిరునామా తదితర వివరాల్లో సవరణలు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు కూడా బీఎల్వోల వద్ద దరఖాస్తులు పొందవచ్చన్నారు.
ఓటర్ జాబితాలో మ్యాపింగ్ సమస్యల పరిష్కారంతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు ప్రత్యేక క్యాంపెయిన్ డేల్లో పాల్గొని తమ ఓటు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.