Vegetable Prices Hike: కొత్త ఏడాది మొదట్లోనే ధరల పిడుగు.. సామాన్యుడి జేబుకు భారీ షాక్..!!
Vegetable Prices Hike: కొత్త ఏడాది మొదట్లోనే ధరల పిడుగు.. సామాన్యుడి జేబుకు భారీ షాక్..!!
Vegetable Prices Hike: కొత్త సంవత్సరం 2026 సామాన్య ప్రజలకు ఊరటకంటే ధరల షాక్తోనే ప్రారంభమైంది. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగి, సామాన్యుల జేబుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, చికెన్, గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
తీవ్రమైన చలి ప్రభావంతో కూరగాయల దిగుబడి తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలో టమాటా, బీరకాయ, బెండకాయ వంటి సాధారణ కూరగాయలు కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి ధర అయితే ఏకంగా సెంచరీ దాటింది. ఇక మునగకాయ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. కిలో ధర రూ.400కు చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయడానికే వెనుకాడుతున్నాయి.
కూరగాయలతో పాటు మాంసాహార ధరలు కూడా భారీగా పెరిగాయి. చికెన్ కిలో ధర రూ.300కు చేరగా, కోడిగుడ్డు ఒక్కోటి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రోజువారీ ఆహార ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే కొన్ని రోజుల్లో ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని సామాన్యులు కోరుతున్నారు. లేకపోతే కొత్త ఏడాది మొత్తం ఖరీదైన జీవనంతోనే గడవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.