Medak: కేజీబీవీలో ఫుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థినులకు అస్వస్థత!
Medak: పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది.
Medak: పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (KGBV) లో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన కూరనే రాత్రికి వడ్డించడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
గురువారం (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం విద్యార్థినులకు భోజనంలో గుడ్డు కూర వడ్డించారు. అయితే, అదే కూరను పారేయకుండా, రాత్రికి దానినే పులుసుగా మార్చి మళ్ళీ విద్యార్థినులకు వడ్డించినట్లు సమాచారం. ఈ వికృత పోకడ కారణంగా భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థినులకు వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి.
అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థినులను పాఠశాల సిబ్బంది వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందుతోంది. బాధితుల్లో ఇప్పటికే 10 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.