Hyderabad: కొంపల్లిలో విషాదం.. ఐదో అంతస్తు నుంచి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
Hyderabad: ఉపాధి కోసం సుదూర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆ కూలీ దంపతుల జీవితాల్లో తీరని శోకం నిండింది.
Hyderabad: ఉపాధి కోసం సుదూర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆ కూలీ దంపతుల జీవితాల్లో తీరని శోకం నిండింది. ఆడుకుంటూ కళ్లముందే తిరుగుతుందనుకున్న కన్నబిడ్డ, ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ప్రాణాలు విడిచింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని కొంపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రదీప్, ఉమ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వచ్చి కొంపల్లి ఉమామహేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు కొంపల్లి సమీపంలోని ‘ఓంశ్రీ గెలాక్సీ’ అనే భవన నిర్మాణ సంస్థలో కూలీ పనులు చేస్తున్నారు.
శుక్రవారం తల్లి ఉమ తన నాలుగేళ్ల కుమార్తె కాబ్య బర్మను తీసుకుని భవనంలోని ఐదో అంతస్తులో గదులను శుభ్రం చేయడానికి వెళ్లింది. తల్లి పనిలో నిమగ్నమై ఉండగా, చిన్నారి కాబ్య బాల్కనీలో ఆడుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయింది.
తీవ్ర గాయాలైన చిన్నారిని గమనించిన తోటి కార్మికులు, భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కాబ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్లముందే శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పేట్బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.