టీజీఎస్పీడీసీఎల్లో అవినీతి తిమింగలాలపై వేటు: 8 మంది ఇంజినీర్లు సస్పెండ్..
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)లో అవినీతి ఇంజినీర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.
తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)లో అవినీతి ఇంజినీర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న 8 మంది ఇంజినీరింగ్ అధికారులను బుధవారం ఒకేసారి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, ప్యానెల్ బోర్డుల ఏర్పాటు, మరియు ట్రాన్స్ఫార్మర్ల మంజూరు వంటి పనుల కోసం సదరు అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు 'యాంటీ బ్రైబరీ సెల్'కు వరుసగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఇంటెలిజెన్స్ విభాగం రహస్యంగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా లంచం అంటే గుట్టుచప్పుడు కాకుండా నగదు రూపంలో తీసుకుంటారని అనుకుంటాం. కానీ, ఈ అధికారులు ఏకంగా ఫోన్ పే (PhonePe) వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా లంచాలు స్వీకరించినట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. సాక్ష్యాధారాలతో సహా అవినీతి నిరూపితం కావడంతో ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉపక్రమించింది.
సస్పెన్షన్కు గురైన అధికారులలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు (ADE), అసిస్టెంట్ ఇంజినీర్లు (AE), మరియు సబ్ ఇంజినీర్లు ఉన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యుత్ శాఖలోని మిగిలిన అవినీతి అధికారుల్లో వణుకు మొదలైంది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ చర్య ద్వారా ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.