Maoist: మావోయిస్టులకు చావుదెబ్బ.. అడవిలో ముగిసిన అధ్యాయం!
Maoist Leader Devji Surrendered: మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ జీ (అలియాస్ తిప్పిరి తిరుపతి) మరియు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి తమ అనుచరులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.
దేవ్జీ
Maoist Leader Devji Surrendered: భారత గడ్డపై నక్సలిజం అంతమే లక్ష్యంగా కేంద్రం ప్రారంభించిన యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, దశాబ్దాల పాటు పార్టీని నడిపించిన కీలక కమాండర్లు వరుసగా లొంగిపోతుండడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. తాజా సమాచారం ప్రకారం.. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ దేవ్ జీ (అలియాస్ తిప్పిరి తిరుపతి) మరియు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి తమ అనుచరులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు.
కేంద్ర హోం శాఖ మంత్రి మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చేపట్టిన 'ఆపరేషన్ కగార్-2' మావోయిస్టులకు ఊపిరి ఆడకుండా చేసింది. అడవిలో ఆయుధాలతో పోరాడటం కంటే, జనజీవన స్రవంతిలో కలవడమే శ్రేయస్కరమని నేతలు భావించేలా భద్రతా దళాలు వ్యూహాలను అమలు చేశాయి.
దేవ్ జీ (తిప్పిరి తిరుపతి): పార్టీలో అత్యంత కీలకమైన స్ట్రాటజిస్ట్. తెలంగాణ SIB ముందు ఆయన లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.రాజిరెడ్డి మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు. ఈయనతో పాటు మరో 16 మంది ముఖ్య నేతలు కూడా ఆయుధాలు వదిలేసి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం గత కొద్ది కాలంగా వీరితో చర్చలు జరుపుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీల గురించి అవగాహన కల్పించింది.
ఒకప్పుడు అబేధ్యమైన కోటల్లా ఉన్న బస్తర్ అడవులు, సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడు పోలీసుల ఆధీనంలోకి వచ్చాయి. ఆపరేషన్ కగార్ కింద అడవిలోని లోతైన ప్రాంతాల్లో సైతం భద్రతా బలగాలు క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టుల సంచారం పరిమితమైపోయింది. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కేడర్లో నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింది.
కేంద్రం విధించిన గడువు దగ్గరపడుతుండడంతో, మిగిలిన మావోయిస్టు శ్రేణులపై ఒత్తిడి పెరుగుతోంది. హింసను వదిలి సమ్మోహన పద్ధతిలో చర్చలకు రావాలని లేదా లొంగిపోవాలని ప్రభుత్వం ఇస్తున్న పిలుపునకు ఈ తాజా సరెండర్లు ఒక పెద్ద ముందడుగు.దేవ్ జీ, రాజిరెడ్డి వంటి అగ్రనేతలు బయటకు రావడం అంటే మావోయిస్టు పార్టీకి వెన్నెముక విరిగినట్లే. మరికొద్ది రోజుల్లోనే దశాబ్దాల సుదీర్ఘ సాయుధ పోరాటానికి అధికారికంగా ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.