గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నిన్నమొన్నటి వరకూ అడుగంటిన జురాల ప్రాజెక్టులో వరదల ప్రభావంతో 88వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సాయంత్రం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 693.675 అడుగులకు నీరు చేరుకుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేసి.. 38వేల 115 క్యూసెక్కుల వరదనీటికి దిగువకు విడుదల చేశారు.