లాక్డౌన్ : పోలీసుల లాఠీఛార్జ్పై హైకోర్టు విచారణ.. ఆ ఘటనను రాష్ట్రం మొత్తం ఆపాదించలేం: హైకోర్టు
లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల దాడులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాది ఉమేష్ చంద్ర లేఖను సుమోటోగా తీసుకుంది. వనపర్తిలో తండ్రీకొడుకు బైక్పై వెళ్తుండగా పోలీసులు దాడి చేసిన ఘటనను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని పిటిషన్ తెలిపారు.
ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో పోలీసుల దాడులపై తామూ చూశామని తెలిపింది హైకోర్టు. వనపర్తి ఘటనను రాష్ట్రానికి మొత్తం ఆపాదించలేమని పోలీసులు నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. కానీ ప్రజలు ఎందుకు రోడ్లపైకి వచ్చారు? అత్యవసరమా? కాదా అనేది చూడాలని సూచించింది. ఒకవేళ అనవసరంగా రోడ్లపైకి వస్తే రీజనబుల్ ఫోర్స్ను ఉపయోగించేలా చూడాలని డీజీపీకి సూచించింది. వనపర్తి ఘటనపై ఏం జరిగిందంటూ హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో.? ఘటనపై 17 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల17కు వాయిదా వేసింది హైకోర్టు.