నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం
Telangana: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కమిటీ సమావేశం
నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం
Telangana: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. ఓ వైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. మరో వైపు పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంకానుంది. గాంధీభవన్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి కేవలం 50 రోజులు మాత్రమే అయ్యాయి. అయితే ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోవడం.. మరో వైపు గత ప్రభుత్వం చేసిన పనులల్లో అవినీతి జరిగిందని గుర్తించే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ల వారీగా ఇన్ఛార్జ్లను నియమించింది. మరోవైపు ఉమ్మడి జిల్లాలకు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించింది. ఉమ్మడి జిల్లాల నాయకులు, ఇన్చార్జ్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లతో సమావేశమయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. మరో వైపు ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలకు బూస్టప్గా ఏఐసీసీ చీఫ్ ఖర్గే బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు.
ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు.. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అటు పాలనను, ఇటు పార్టీ కార్యక్రమాలను బ్యాలెన్స్డ్గా ముందుకెళ్లేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్లాన్ చేస్తున్నారు రేవంత్. జిల్లాల పర్యటనలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. మైలేజ్ తీసుకువచ్చిన ఇంద్రవెల్లి సభను సెంటిమెంట్గా భావిస్తూ.. అక్కడి నుంచి త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.