Bandi Sanjay Fires on CM KCR: కేసీఆర్‌ సోమరిపోతుగా వ్యవహరిస్తున్నారు : బండి సంజయ్

Bandi Sanjay Fires on CM KCR: గాంధీ ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్‌ ప్లాంట్ పని చేయడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Update: 2020-07-22 13:34 GMT
Telangana BJP president Bandi Sanjay Fire on CM KCR over the corona cases

Bandi Sanjay Fires on CM KCR: గాంధీ ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్‌ ప్లాంట్ పని చేయడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ సోమరిపోతుగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు మానవత్వం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పోరేట్ ఆస్పత్రులకు బిల్లులు కట్టలేక ఎంతో మంది ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అయినా ఆ సమస్యను ఆయన చిన్నదిగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని అన్నారు. జిల్లాల్లో ప్రతిరోజు నమోదవుతున్న కరోనా కేసుల వివరాల విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందని ఆగ్రహించారు. దీనివల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే సిబ్బంది విధులకు రావడానికి భయపడుతున్నారని ఆయన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో దారుణమైన వైద్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. వారికి అందిస్తున్న ఎన్‌-95 మాస్కుల్లో క్వాలిటీ లేదని బండి సంజయ్‌ చెప్పారు. ఫాంహౌస్, ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి బయటకు రావాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ హైకోర్టును ధిక్కరించే పరిస్థితి రావటం దారుణమని విమర్శించారు. ప్రజల ప్రాణాల గురించి రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించినా ముఖ్యమంత్రి స్పందించకపోవటం అన్యాయమని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News