కోడెల శివప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఉస్మానియా హాస్పిటల్లో ముగ్గురు ప్రొఫెసర్ల బృందం కోడెల భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. కోడెల పోస్టుమార్టాన్ని పోలీసులు వీడియోగ్రఫీ చేశారు. అయితే, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఉరేసుకుని చనిపోయినట్లు తేలింది.
కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న ఫోరెన్సిక్ నిపుణులు చెవులు, గొంతు దగ్గర ఉరేసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. కోడెల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవడంతో అల్లుడు మనోహర్కు భౌతికకాయాన్ని అప్పగించారు. అనంతరంత కోడెల పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. రేపు ఉదయం వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే కోడెల భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోడెల భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. రేపు ఉదయం 8గంటల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రోడ్డుమార్గంలో కోదాడ, సూర్యాపేట, విజయవాడ, గుంటూరు మీదుగా కోడెల పార్థివదేహాన్ని నర్సరావుపేట తరలించనున్నారు. అయితే, కోడెల మృతదేహంతోపాటు చంద్రబాబు కూడా గుంటూరు వెళ్లనున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్ధం రేపు సాయంత్రం వరకు గుంటూరు టీడీపీ ఆఫీస్లో కోడెల భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆ తర్వాత నర్సరావుపేటకు తరలించనున్నారు. అయితే రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కోడెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.