లంచంతీసుకుని డెత్ సర్టిఫికెట్ ఇవ్వని వీఆర్వో.. పంచాయతీ ఆఫీసులో బాధితుల ఆందోళన
డెత్ సర్టిఫికేట్ కోసం పంచాయతీ సెక్రటరీకి లంచం ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా మరణ ద్రువీకరణ పత్రం ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీ ఆపీసు చుట్టూ తిప్పించుకుంటున్నాడు.
డెత్ సర్టిఫికేట్ కోసం పంచాయతీ సెక్రటరీకి లంచం ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా మరణ ద్రువీకరణ పత్రం ఇవ్వకుండా పంచాయతీ సెక్రటరీ ఆపీసు చుట్టూ తిప్పించుకుంటున్నాడు. దీంతో బేజారెత్తిన పిటిషన్ దార్లు పంచాయితీ కార్యాలయంలో బైఠాయించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి గత సెప్టెంబర్ 12న మృతి చెందాడు. నరసయ్య డెత్ సర్టిఫికేట్ కోసం ఆయన భార్య లింగమ్మ కేసముద్రం పంచాయితీ కార్యాలయంలో సెప్టెంబర్ 22న దరఖాస్తు ఇచ్చారు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పంచాయితీ సెక్రటరీ పది వేలు లంచం డిమాండ్ చేసి ఆరువేలకు బేరం కుదుర్చుకున్నాడు.
పంచాయతీ సెక్రటరీకి ఆరు వేల రూపాయల లంచాన్ని నరసయ్య కుటుంబసభ్యులు ఇవ్వగా, సెప్టెంబర్ 24న ఫారం-6 ను చేతిరాతతో రాసి ఇచ్చాడు. రైతు భీమాకు ఫారం -6 కాదు ఫారం -10 కావాలని ఎల్ ఐసీ ఆఫీసు వారు చెప్పారు. నరసయ్య డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటూ పంచాయితీ సెక్రటరీ ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నాడు. దీంతో విసిగిపోయిన నరసయ్య భార్య, కుమర్తెలు, అల్లుడు పంచాయతీ కార్యాలయంలో బైఠాయించారు. వెంటనే నరసయ్య డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలని పంచాయితీ సెక్రటరీతో గొడవకు దిగారు. లంచం ఇచ్చినా పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. నరసయ్య కుటుంబీకుల ధర్నాతో భయపడిపోయిన పంచాయితీ సెక్రటరీ వెంటనే డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు. దీంతో నరసయ్య కుటుంబసభ్యులు ధర్నా విరమించారు.