హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల కేసు.. రంగంలోకి షీ టీమ్స్..
హైదరాబాద్ కోఠి మహిళా యూనివర్సిటీలో వేధింపుల కేసులో విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే కోఠి ఉమెన్స్ కాలేజీకి చేరుకున్న షీ టీమ్స్..
హైదరాబాద్ కోఠి మహిళా యూనివర్సిటీలో వేధింపుల కేసులో విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే కోఠి ఉమెన్స్ కాలేజీకి చేరుకున్న షీ టీమ్స్.. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తీరుపై దర్యాప్తు ప్రారంభించాయి. వినోద్ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో పాటు.. షీ టీమ్స్కు ఆడియో సహా పలు ఆధారాలను పంపించారు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. విద్యార్థినిల ఆరోపణలపై సమగ్ర విచారణ జరుపుతున్నాయి.
కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. వర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థినులు.. తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ లో మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వినోద్ ప్రవర్తనతో హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని షీ టీమ్స్ను ఆశ్రయించారు. ఈ విషయంపై ఇప్పటికే హాస్టల్ వార్డెన్తో పాటు.. కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రహస్యంగా ఆన్లైన్ ద్వారా షీ టీమ్స్కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. తక్షణమే ఘటనపై విచారణ చేపట్టి.. మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. కోఠి ఉమెన్స్ కాలేజీకి చేరుకున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. విద్యార్థులకు వేధింపుల ఘటనపై ఆయన ఆరా తీస్తున్నారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న మెన్ ఇన్ఛార్జ్ వినోద్పై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు.