KCR SIT Inquiry: కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర ఉద్యమ వ్యూహాల గదిలోనే నేడు సిట్ విచారణ
KCR SIT Inquiry: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా నందినగర్ నివాసంలో సిట్ విచారణ ఎదుర్కొంటున్న కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. అదే గదిలో విచారణ జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
KCR SIT Inquiry: కేసీఆర్ భావోద్వేగం.. రాష్ట్ర ఉద్యమ వ్యూహాల గదిలోనే నేడు సిట్ విచారణ
KCR SIT Inquiry: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నందినగర్ నివాసంలో ఆదివారం సిట్ విచారణ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఆయన తన నివాసంలోని రెండో అంతస్తులో అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు.
విచారణ సందర్భంగా, ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, రాష్ట్ర సాధన కోసం ఎన్నో వ్యూహాలను రచించిన అదే గదిలో నేడు విచారణ ఎదుర్కోవాల్సి రావడం తనకు అత్యంత బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, అనేక కీలక చర్చలు ఇక్కడే నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. ఈ గదిలోనే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, విచారణ సమయంలో పోలీసులు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. విచారణ ప్రారంభం కాగానే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర ముఖ్య నేతలను నివాసం నుంచి బయటకు పంపించారు. నిబంధనల ప్రకారం కేసీఆర్ తరఫున న్యాయవాదులు విచారణ సమయంలో లోపల ఉండేందుకు సిట్ అధికారులు అనుమతి నిరాకరించారు.
నందినగర్ ప్రాంతమంతా భారీ పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టంగా మారింది. ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.