CM KCR: బీఆర్ఎస్ తొలి జాబితాతో విపక్షాలకు గులాబీ బాస్ సవాల్
CM KCR: మొత్తం 119 సీట్లకు 115 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
CM KCR: బీఆర్ఎస్ తొలి జాబితాతో విపక్షాలకు గులాబీ బాస్ సవాల్
CM KCR: తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 119 సీట్లకు 115 స్థానాల్లో గులాబీ దళపతి.. తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలకు క్యాండిడేట్స్ను ఫైనల్ చేయాల్సి ఉంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే అభ్యర్థుల లిస్ట్ను అందరికంటే ముందే ప్రకటించి.. ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అయితే.. ఈసారి కూడా సిట్టింగ్లకు ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ.. టికెట్లను ప్రకటించారు గులాబీ బాస్.
అయితే.. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాను చూస్తే.. విపక్షాలకు బీఆర్ఎస్ పెద్ద సవాల్ విసిరిందా అన్నట్టు ఉంది. అత్యధికంగా 58 స్థానాలను ఓసీలకు కేటాయించిన కేసీఆర్.. పెద్ద సాహసమే చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. కొన్ని సామాజిక వర్గాలకు ఒక్క సీట్ కూడా కేటాయించకపోవడం.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీసీలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని కొందరి వాదన. రెడ్లకు పెద్దపీట వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మెజార్టీ స్థానాలు ఓసీలకు కేటాయించి.. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేలా కేసీఆర్ వ్యూహం రచించారనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం తమవైపే ఉందని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కేటాయిస్తుందా అనేది చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ రెడ్లకు 38 స్థానాలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ఎన్ని ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే హస్తం పార్టీలో ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. మొత్తం 119 స్థానాల్లో 34 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్లోని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అటు తెలంగాణ బీజేపీకి సైతం ఈ సమస్య పొంచి ఉంది. దీంతో గులాబీ దళపతి ముందే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి విపక్షాలను ఇరకాటంలో పెట్టారా..? అనే చర్చ జరుగుతోంది.