తెలంగాణలో కుక్కల బెడద
Hyderabad: మొన్న అంబర్పేటలో, నిన్న చైతన్యపురిలో, నేడు కరీంనగర్లో వీధి కుక్కల దాడులతో చిన్నారులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి కుక్క దూసుకొస్తుందోనని జంకుతున్నారు. తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకు పెరిగిపోతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే అధికారులు తూతూమంత్రంగా స్పందించి వదిలేస్తున్నారు. కుక్కల బెడదపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంబర్పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఆ వెంటనే చైతన్యపురిలో మరో నాలుగేళ్ల బాలుడిని కుక్కలు గాయపరిచాయి. ఇప్పుడు కరీంనగర్లో హాస్టల్లోకి చొరబడి మరీ విద్యార్థిని కరిచాయి. ఇలా రోజూ ఏదో ఒక చోట చిన్నారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అధికారులు సరైన ప్రణాళికలు అమలు చేస్తే వీధి కుక్కల నుంచి ఎలాంటి హాని ఉండదు. కానీ ఘటన జరిగి రెండు మూడు రోజుల మాత్రమే హడావిడి చేసి ఆ తర్వాత గాలికొదిలేస్తే ఇలాంటి సంఘటనలే తలెత్తుతాయని విమర్శలు వస్తున్నాయి.
అంబర్పేట ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలచివేసింది. చిన్నారిని వెంట బడి మరీ కుక్కలు దాడి చేసి చంపేశాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడి శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. రెండు రోజులు ఆ తల్లి పడుతోన్న ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మరి ఆ బాలుడి మృతికి కారకులెవరు? ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? వీధి కుక్కల ఆకలికి ఇంకెంతమంది చిన్నారులు బలవ్వాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అధికారులు ఎవరూ లేరు.