తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు
Telangana: తాజాగా 9 మంది ఐఏఎస్లను ఓ ఐఎఫ్ఎస్లను బదిలీ చేసిన సర్కార్
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు
Telangana: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 9 మంది ఐఏఎస్ అధికారులను, ఓ ఐఎఫ్ఎస్ అధికారిని రేవంత్ రెడ్డి సర్కార్ ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేపట్టిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ను ప్రభుత్వం బదిలీ చేసింది. టీఎస్పీఎస్సీ నూతన కార్యదర్శిగా ఐఏఎస్ నవీన్ నికోలస్ను నియమించింది.
పలు శాఖల కార్యదర్శులను కూడా మార్చేసింది. ఫిషరీస్ కమిషనర్గా బి. గోపికి అదనపు బాధ్యతలు అప్పగించింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా బి. బాలదేవి, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్గా అనిత రామచంద్రన్, సమచార శాఖ ప్రత్యేక కమిషనర్గా హన్మంతరావు, ఉద్యానవన డైరెక్టర్గా కే. అశోక్ రెడ్డిలను నియమించింది. మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఎం. నిర్మల కాంతి వెస్లీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శిగా కే. సీతాలక్ష్మీ, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్గా జి. ఫణీంద్ర రెడ్డి, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఐఎఫ్ఎస్ అధికారి వీఎస్ఎన్వీ ప్రసాద్లను నియమిస్తూ.. సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.