Hyd Metro: మెట్రోకు పెరుగుతున్న ఆదరణ.. ఒకేరోజు 5.47లక్షల మంది ప్రయాణం
Hyd Metro: సోమవారం నుంచి శుక్రవారం వరకు కారిడార్-3లో రద్దీ
Hyd Metro: మెట్రోకు పెరుగుతున్న ఆదరణ.. ఒకేరోజు 5.47లక్షల మంది ప్రయాణం
Hyd Metro: మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. ఒకే రోజు 5లక్షల 47వేల మంది మూడు కారిడార్లలో ఉన్న మెట్రో మార్గాల్లో రాకపోకలు సాగించారు. మెట్రో సేవలు ప్రారంభమైన ఆరేండ్ల లో ఒక రోజు ప్రయాణికుల సంఖ్య 5లక్షల 50వేలకు చేరువలో ఉండటం ఒక రికార్డుగా అధికారులు పేర్కొంటున్నారు.నగరంలో అత్యంత కీలకమైన మార్గాల్లో మెట్రో రైళ్ల రాకపోకలు ఉండటంతో ఏటా రద్దీ గణనీయంగా పెరుగుతూనే ఉంది.
కరోనా ప్రభావం చూపి నా క్రమంగా మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా మెట్రో అధికారులు రైళ్లను ఆయా మార్గాల్లో నడుపుతున్నారు. మహానగరంలో ఐటీ కార్యకలాపాలతో పాటు దసరా, దీపావళి సీజన్ల తో సందడి నెలకొని ఉండటంతో నగరంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఐటీ కంపెనీల కార్యకలాపాలుండే సోమవారం నుంచి శుక్రవారం వరకు కారిడార్-3లో రద్దీ అధికంగా ఉంటున్నదని, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు.