విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం
* సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపు * నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Representational Image
హైదరాబాద్లో దిశ ఘటన మన కనులముందు ఇంకా కదులాడుతూనే ఉంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. అంతటి దారుణ ఘటనను మరువకముందే మరో ఉదంతం హైదరాబాద్ ప్రజానీకాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు ఏ విధంగా తిరిగివస్తారో అసలు తిరిగి వస్తారో, రారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్ ఘట్కేసర్లో ఫార్మసీ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన.. మరోసారి భాగ్యనగర ప్రజల్లో భయాన్ని రేకెత్తించింది. ఈ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నాగారంలోని రాంపల్లి చౌరస్తా దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు.
ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసినట్టు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. గతంలో కూడా ఇలాంటి అనేక నేరాలకు పాల్పడినట్టు నిందితులు చెప్పారు. అత్యాచారం తర్వాత విద్యార్ధినిని హత్య చేయాలని భావించగా పోలీసుల సైరన్తో చెట్ల పొదల్లో నుంచి పరారైనట్టు పోలీసుల విచారణలో తెలిపారు.
గతంలో కూడా కొంతమంది మహిళలపై ఇదే తీరుగా నిందితులు ప్రవర్తించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. నిందితులపై కిడ్నాప్, రేప్, బెదిరింపులకు సంబంధించి పలు కేసులు నమోదు చేశారు. ఇవాళ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.