Kesamudram: సినిమా థియేటర్లను, ఫంక్షన్ హాల్ లను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ వి.పి గౌతమ్
జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ మహబూబాబాద్ పట్టణం లోని పలు సినిమా థియేటర్లను, ఫంక్షన్ హాల్ లను ఆకస్మికంగా సందర్శించారు.
మహబూబాబాద్: జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ మహబూబాబాద్ పట్టణం లోని పలు సినిమా థియేటర్లను, ఫంక్షన్ హాల్ లను ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పట్టణంలోని ముకుంద థియేటర్, థియేటర్లలో సందర్శించి ఈనెల 21 వరకు మూసివేసినట్లు థియేటర్ బయట గేటు పై ప్రదర్శించిన నోటీస్ ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 21వ తేదీ వరకు థియేటర్లను మూసివేయాలని గతంలో ఆదేశించామని, ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు థియేటర్లను మూసివేయాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా కిరాణ వర్తక వాణిజ్య సంఘం ద్వారా నిర్వహించబడుతున్న ఫంక్షన్ హాళ్లను పరిశీలించి ఈనెల 31 తేదీ వరకు 3 శుభ కార్యాలు నమోదైనాయని, ఇంటి వద్దనే శుభకార్యాలు చేసుకోవలసిందిగా కోరడం జరిగిందని స్థలాభావం వల్ల హాల్లో చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి రాగా 200 మంది కంటే తక్కువగా శుభకార్యాలు చేసుకోనెలా పర్యవేక్షించాల్సినదిగా స్థానిక తహసీల్దార్ ను ఆదేశించారు. ఈనెల 31 తర్వాత ఏమైనా శుభ కార్యాలు నమోదు చేసి జరిగినచో చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో కొమురయ్య, స్థానిక తహసీల్దార్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.