కరోనా వైరస్ మృతుల సంఖ్య 305కు చేరింది. చైనాలో 304 మంది చనిపోగా.. చైనా బయట తొలి కరోనా మృతి ఫిలిప్పీన్స్లో నమోదైంది. ఆ దేశ రాజధాని మనీలాలో నివసిస్తున్న ఓ చైనీయుడు వైరస్ బారిన పడి మరణించాడు. ఇక చైనాలో ఈ వైర్సతో బాధపడుతున్న వారి సంఖ్య 14వేల 380కి చేరుకుందని ఆ దేశ హెల్త్ కమిషన్ వెల్లడించింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో 100 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
కరోనా వైరస్పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న పల్మోనాలజిస్ట్లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేసినట్లు సూచించారు.
మరో పక్క ఇవాళ్టి నుంచి గాంధీ మెడికల్ కాలేజ్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు మంత్రి ఈటల రాజేందర్. ప్రతి రోజు 30 మందికి కరోనా వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఒక్కొక్క పరీక్షకు 10 గంటల సమయం పడుతుందన్నారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా పాజిటివ్గా నమోదు కాలేదన్నారు.