CM Revanth: వారి మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానిమోడీతో భేటీ అయ్యారు. ఐదు అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అండగా నిలవాలని కోరారు.
వారి మరణాలపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానిమోడీతో భేటీ అయ్యారు. ఐదు అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు అండగా నిలవాలని కోరారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. అనుమానాస్పద మరణాలు, అవినీతి కేసులు, కేంద్ర ప్రభుత్వం తీరు, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పదంగా మృతి చెందితే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్నాయన్నారు. కేదార్, కాళేశ్వరం కేసులు వాదిస్తున్న న్యాయవాది సంజీవ్ రెడ్డి, కేసు వేసిన లింగమూర్తి మరణాలపై ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపైనా సీఎం రేవంత్ స్పందించారు. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో 11 సంస్థలు పని చేస్తున్నాయని చెప్పారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్ఎల్బీసీని పూర్తి చేసి తీరుతామన్నారు. కమీషన్లు రావని ఉద్దేశంతోనే ఎస్ఎస్బీసీ పనులను కేసీఆర్ పక్కన పెట్టేశారని రేవంత్ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పెరిగిన అంచనాలతో కలిపి రూ.5000 కోట్ల లోపే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని సీఎం వివరించారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్లను ఎవరు తీసుకొస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మెట్రోను కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురాకుండా అడ్డుకున్నదే కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తాను ప్రధానికి ఇచ్చిన ఐదు విజ్ఞప్తులను సాధించుకుని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్ దేనని స్పష్టం చేశారు. తన వంతుగా తాను చేయాల్సింది చేశానన్నారు. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చన్నారు. అలా చేస్తే బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం చేస్తానని ఆఫర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక తన కేబినెట్లోని మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారందరూ అనుభవజ్జులేనని అన్నారు. వారి వారి శాఖల్లో సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో తన పాలన అద్బుతంగా ఉందన్నారు. ఎవరి ఫోన్లలో వారు ధైర్యంగా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతా అవినీతే జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పందించిన సీఎం.. ఉప ఎన్నికలు ఎలా వస్తాయో అర్థం కావడంలేదన్నారు. 2014 నుంచి 2024 వరకు ఉన్న శాసన వ్యవస్థే ఇప్పుడు ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎక్కడుందని ప్రశ్నించారు. పోటీలో లేని వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పని చేస్తోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్కు నిధులు ఇవ్వాలని, రీజినల్ రింగ్ రైల్, డ్రైపోర్ట్లు మంజూరు చేయాలని, సెమీ కండక్టర్ మిషన్కు అనుమతించాలని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.