Karimnagar: అభివృద్ధిలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం: ప్రజాప్రతినిధులకు కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపు
Karimnagar: నగరాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
Karimnagar: అభివృద్ధిలో జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం: ప్రజాప్రతినిధులకు కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపు
కరీంనగర్: నగరాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా.. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ప్రజాప్రతినిధులకు కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
విధులపై అవగాహన ఉండాలి:
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేటర్లు ఎంత బాధ్యతగా ఉంటే పట్టణాలు అంత వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ చట్టాలు, వివిధ విభాగాల పనితీరుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శానిటేషన్ పర్యవేక్షణ, మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే మున్సిపాలిటీల్లో 'ప్రజావాణి'ని ప్రారంభించామని తెలిపారు.
అవినీతి రహిత పాలనే లక్ష్యం:
మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన కార్పొరేటర్లు పౌర సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అవినీతి రహిత పాలనతో ఆదర్శంగా నిలవాలని కోరారు. వేసవి నేపథ్యంలో తాగునీటి వృధాను అరికట్టాలని, పైప్లైన్ లీకేజీలను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జవాబుదారీతనం పెరగాలి:
డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్లో 66 స్థానాలకు గాను 46 మంది కొత్తవారు ఎన్నికయ్యారని, వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మున్సిపల్ డాష్ బోర్డు ద్వారా దరఖాస్తుల స్థితిగతులను పర్యవేక్షించడం వల్ల పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో రమేష్, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు మరియు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.