BCCI: బీసీసీఐలో భారీ దొంగతనం.. లక్షల విలువైన సామాను మాయం
BCCI: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ఆఫీస్ నుండి ఒక సంచలన వార్త బయటికి వచ్చింది. బీసీసీఐ కార్యాలయంలో భారీ దొంగతనం జరిగింది.
BCCI: బీసీసీఐలో భారీ దొంగతనం.. లక్షల విలువైన సామాను మాయం
BCCI: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ఆఫీస్ నుండి ఒక సంచలన వార్త బయటికి వచ్చింది. బీసీసీఐ కార్యాలయంలో భారీ దొంగతనం జరిగింది. లక్షల విలువైన సామాను మాయం కావడంతో అందరూ షాకయ్యారు. భారత క్రికెట్ బోర్డు ఆఫీస్లో ఇంత భద్రత ఉన్నా ఇంత పెద్ద చోరీ ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఈ చోరీ వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలియగానే ఆఫీస్లో పెద్ద అలజడి మొదలైంది.
బీసీసీఐ ఆఫీసు నుంచి రూ.6.5లక్షల విలువైన ఐపీఎల్ జెర్సీలు చోరీ అయ్యాయి. ఈ దొంగతనం అందరినీ షాక్ చేసింది. బీసీసీఐ ఆఫీస్లో చోరీ చేయడానికి ప్లాన్ చేసింది ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ఈ దొంగ మరెవరో కాదు, అక్కడే గార్డుగా పనిచేస్తున్న ఫరూఖ్ అస్లాం ఖాన్. ఇతను మొత్తం 261 జెర్సీలను దొంగిలించాడు. ఒక్కో జెర్సీ ధర రూ.2,500.
ఫరూఖ్ను ఈ చోరీ కేసులో అరెస్టు చేశారు. అరెస్టు అయిన తర్వాత ఫరూఖ్ అస్లాం ఖాన్ స్వయంగా పోలీసులకు తాను ఎందుకు దొంగతనం చేశాడో చెప్పాడు. ఆ గార్డు తన ఆన్లైన్ జూదం ఆడడం కోసం ఇన్ని జెర్సీలను దొంగిలించాడని పోలీసులు తెలిపారు. అతను ఏదో ఒక టీమ్ జెర్సీలు కాకుండా, వేర్వేరు టీమ్ల జెర్సీలను దొంగిలించడం విశేషం. దొంగతనం చేసిన తర్వాత, ఆ గార్డు ఈ జెర్సీలను హర్యానాలోని ఒక ఆన్లైన్ డీలర్కు అమ్మాడు. ఆ డీలర్తో అతను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు.
ఈ కిట్లు ఆటగాళ్లవా లేక సాధారణ ప్రజల కోసం తయారుచేసినవా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ జెర్సీలు జూన్ 13న చోరీ అయ్యాయి. కానీ, స్టోర్ రూమ్ నుండి సరుకు మాయమైందని ఆడిట్లో తేలినప్పుడు మాత్రమే దొంగతనం గురించి తెలిసింది. బీసీసీఐ అధికారులు వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, గార్డు ఒక డబ్బాలో జెర్సీలను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఈ జెర్సీలు చోరీ చేసినవి అని ఆన్లైన్ డీలర్కు తెలియదని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
చోరీ అయిన 261 జెర్సీలలోంచి 50 జెర్సీలను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. డీలర్ నుండి తనకు అకౌంట్లో డబ్బు వచ్చిందని, కానీ ఆ డబ్బు మొత్తం ఆన్లైన్ జూదంలో పోగొట్టుకున్నానని ఫరూఖ్ చెప్పాడు. అతను నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి పోలీసులు ఫరూఖ్ బ్యాంక్ అకౌంట్ను పరిశీలిస్తున్నారు.