T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026.. సెమీఫైనల్ వేదికలు ఖరారు
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ముగిసిన వెంటనే, తదుపరి మెగా టోర్నమెంట్ అయిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026కు సన్నాహాలు మొదలయ్యాయి.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026.. సెమీఫైనల్ వేదికలు ఖరారు
T20 World Cup 2026 : ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ముగిసిన వెంటనే, తదుపరి మెగా టోర్నమెంట్ అయిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026కు సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే వేదికలను ఖరారు చేశారు. భారత్లో ఐదు నగరాలు, శ్రీలంకలో మూడు స్టేడియాలను ఎంచుకున్నారు. అయితే, తాజాగా సెమీఫైనల్ మ్యాచ్ల వేదికలను ఖరారు చేయగా, ముంబై మరియు ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు నాకౌట్ మ్యాచ్ల ఆతిథ్యం దక్కలేదు.
20 జట్లు పాల్గొనే టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్ల కోసం వేదికలను ఐసీసీ, బీసీసీఐ కలిసి ఖరారు చేశాయి. భారత్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలను సెమీఫైనల్ మ్యాచ్ల కోసం షార్ట్లిస్ట్ చేశారు. కొలంబోలోని ఒక స్టేడియాన్ని కూడా సెమీఫైనల్ కోసం ఎంచుకున్నారు. దీని కారణంగా ముంబైలోని వాంఖడే స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వంటి ప్రధాన మైదానాలకు ఈ కీలకమైన నాకౌట్ మ్యాచ్ల ఆతిథ్యం దక్కలేదు.
సెమీఫైనల్ వేదికల ఎంపికలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన అంశంగా మారింది. పాకిస్తాన్ తమ టోర్నమెంట్లో అన్ని మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడాలని ఐసీసీ మరియు బీసీసీఐ మధ్య ఒప్పందం కుదిరింది. ఒకవేళ శ్రీలంక లేదా పాకిస్తాన్, లేదా రెండు జట్లు సెమీఫైనల్కు చేరుకుంటే, ఆ మ్యాచ్లను తప్పనిసరిగా కొలంబోలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కారణంగానే కొలంబో సెమీస్ వేదికల్లో ఒకటిగా మారింది. ఒకవేళ పాకిస్తాన్ లేదా శ్రీలంక సెమీఫైనల్కు చేరుకోకపోతే, అప్పుడు రెండు సెమీఫైనల్ మ్యాచ్లను కోల్కతా, అహ్మదాబాద్లలోనే నిర్వహిస్తారు.
ఫైనల్ మ్యాచ్ వేదికపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ మ్యాచ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సెమీస్ తరహాలోనే, ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్కు చేరుకుంటే, అప్పుడు ఆ ఫైనల్ మ్యాచ్ను కూడా కొలంబోలోనే నిర్వహించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ఫార్మాట్ 2024లో జరిగిన టోర్నమెంట్ మాదిరిగానే ఉంటుంది. మొత్తం 20 జట్లను 5 జట్లతో కూడిన నాలుగు వేర్వేరు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 రౌండ్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి నాలుగు జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. నాకౌట్ మ్యాచ్లు మినహా, భారత్లో మ్యాచ్లు జరగనున్న ఇతర నగరాలు: ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్. శ్రీలంకలో కొలంబోలోని రెండు స్టేడియంలు, క్యాండీలోని ఒక స్టేడియాన్ని ఈ ప్రపంచ కప్ కోసం ఎంచుకున్నారు.