T20 World Cup 2026: సెమీఫైనల్స్‌కు రెఫరీల లిస్ట్ విడుదల.. టీమిండియా దిగ్గజంకు కీలక బాధ్యతలు!

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 నాకౌట్ పోరుకు సన్నాహాలు పూర్తి.. సెమీస్‌కు అనుభవజ్ఞులైన అధికారుల నియామకం, భారత మాజీ స్టార్‌కు కీలక బాధ్యతలు!

Update: 2026-03-03 12:56 GMT

T20 World Cup 2026: సెమీఫైనల్స్‌కు రెఫరీల లిస్ట్ విడుదల.. టీమిండియా దిగ్గజంకు కీలక బాధ్యతలు!

T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. బుధవారం (మార్చి 4) జరిగే తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఢీకొట్టనున్నాయి. గురువారం (మార్చి 5) రోజున రెండో సెమీఫైనల్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ అధికారులను అధికారికంగా ప్రకటించింది. కీలక నాకౌట్ మ్యాచ్‌లు కావడంతో సీనియర్ అంపైర్లు, మ్యాచ్ రిఫరీలను నియమించింది.

తొలి సెమీఫైనల్:

ఈడెన్‌ గార్డెన్స్‌లో జరగనున్న మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్‌గా నితిన్ మెనన్, ఫోర్త్ అంపైర్‌గా రాడ్ టక్కర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక మ్యాచ్ రిఫరీగా టీమిండియా దిగ్గజం జవగల్ శ్రీనాథ్ నియమితులయ్యారు.

రెండో సెమీఫైనల్:

వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ కీలక పోరుకు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గాఫనీ, అనిల్ పాలేకర్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్‌గా అడ్రియన్ హోల్డ్‌స్టాక్, ఫోర్త్ అంపైర్‌గా పాల్ రైఫెల్ బాధ్యతలు చేపడతారు. మ్యాచ్ రిఫరీగా ఆండి పైక్రాఫ్ట్ నియమితులయ్యారు.

సెమీఫైనల్ మ్యాచ్‌లు టోర్నీలో అత్యంత కీలకమైనవి. కాబట్టి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శక నిర్ణయాలు ఇచ్చే అనుభవజ్ఞులైన వారిని ఐసీసీ ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లలో తీసుకునే ప్రతి నిర్ణయం ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలైట్ ప్యానెల్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. క్రికెట్ అభిమానులు ఈ సెమీఫైనల్ పోరుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News