IND vs ENG: సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు షాక్.. సంజు శాంసన్‌పై ఐసీసీ చర్యలు?

IND vs ENG: సెమీఫైనల్‌కు ముందే టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ.. సంజు శాంసన్‌పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలపై చర్చలు వేడెక్కిన వాతావరణం

Update: 2026-03-03 10:55 GMT

IND vs ENG: సెమీఫైనల్‌కు ముందు భారత్‌కు షాక్.. సంజు శాంసన్‌పై ఐసీసీ చర్యలు?

IND vs ENG: భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌ 2026 చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. మార్చి 4న తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ ఢీకొట్టనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు రెండో సెమీస్ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్‌లో గెలిచి మెగా టోర్నీ ఫైనల్ చేరాలని భారత్‌, ఇంగ్లాండ్‌ చూస్తున్నాయి. అయితే సెమీ ఫైనల్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మార్డియాలో చర్చనీయాంశంగా మారాయి. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ (97 నాటౌట్) ఆడిన తర్వాత భావోద్వేగానికి లోనైన సంజు.. హెల్మెట్‌ను నేలపై విసిరి, దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన ఇప్పుడు వివాదానికి దారితీసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా భావించే ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ప్లేయర్స్ మైదానంలో చూపించే హావభావాలు, ఆగ్రహ ప్రదర్శనలు, వస్తువులు విసరడం వంటి చర్యలు ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్’ పరిధిలోకి వస్తాయి. సంజు చేసిన సెలబ్రేషన్ కూడా ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్’ కిందికి వస్తుందని క్రీడా నిపుణులు అంటున్నారు.

ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలక సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ అంశం చర్చకు రావడం టీమిండియా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఐసీసీ ఈ సంఘటనను తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తే.. సంజు శాంసన్‌కు జరిమానా లేదా ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మ్యాచ్ రిఫరీ నివేదిక ఆధారంగా ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. సంజు ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు బలమైన ఆరంభాలు ఇస్తూ నమ్మకమైన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను సెమీఫైనల్‌కు దూరమైతే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ అవుతుంది. ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అభిమానులందరూ ఇప్పుడు ఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో అవేశ్ ఖాన్ ఇలానే చేస్తే.. ఐసీసీ అతడిని మందలించింది. ఇప్పుడు కూడా సంజును మందలిస్తే చాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News