దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు కొత్త ఛైర్మన్తో కూడిన సెలక్షన్ కమిటీ టీమిండియాను ఎంపిక చేస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు పాత కమిటీ ఇప్పటికే తుది జట్టును ఎంపిక చేసిందని, మార్చిలో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్కు కొత్త ఛైర్మన్తో కూడిన కమిటీ ఎంపిక చేస్తుందని చెప్పారు. ఇప్పటికే చెప్పిన మదన్లాల్, సులక్షణ నాయక్ క్రికెట్ సలహా కమిటీలో కొనసాగుతారని చెప్పారు. అలాగే గంభీర్ స్థానంలో కొత్త వారిని నియమిస్తామన్నారు.
గంభీర్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న కారణంగా అతడికి విరుద్ధ ప్రయోజనాల అంశం ఆటంకంగా మారుతుందనే తప్పిస్తున్నామన్నారు. శస్త్ర చికిత్స తర్వాత హర్దిక్ పాండ్య ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని, ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ఆడలేడని వెల్లడించారు. అతడికి తగినంత సమయం అవసరమని దాదా అన్నారు. కాగా ఇటీవల నిర్వహించిన సామర్థ్య పరీక్షలో పాండ్య విఫలమైన సంగతి తెలిసిందే.